మధిర: కేవలం రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ను కమిషన్ల కోసం చంపేసి.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల అంచనాలతో రీ డిజైనింగ్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లతో మరో ప్రాజెక్ట్ చేపట్టారని అంటూ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇటు సాగు, అటు తాగు నీటి అవసరాలు తీరడమేకాకా లక్ష 50 వేల కోట్ల రూపాయలు మిగిలేవని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకెందుకు మాత్రమే చేపట్టినవని భట్టు విక్రమార్క దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర నిధులు ఏ విధంగా దోపిడీ అవుతున్నాయో రాష్ట్ర ప్రజానీకానికి వివరించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పర్యటన చేస్తున్నానని మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలను లెక్కలతో సహా వివరిస్తామని తెలిపారు. తెలంగాణ వరప్రదాయినిగా కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ను తీసుకువచ్చిందని అన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసి.. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని సరఫరా చేసేందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ఆరంభమై.. చేవెళ్ల వరకు తాగు, సాగునీటిని అందించేలా రూ. 38 వేల కోట్లతో అంచనాలతో ‘ప్రాణహిత’ను రూపొందించారని చెప్పారు. అందులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లతో పనులు చేసిందని వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి వుంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్ను మూడేళ్ళలో పూర్తిచేసినా పదహారున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని, అంతేగాక తెలంగాణలోని 80 శాతం ప్రాంతానికి తాగునీరు లభించేదని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీటి అవసరాలు కూడా తీరేవని చెప్పారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » లక్షన్నర కోట్లు ఫ్యామిలీ ప్యాకేజ్ కోసమే..