తిరుపతి: తిరుమల కొండపై దళారులకు అవకాశాలు కల్పిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనాలలో అవకతవకలను అరికట్టడానికి వీలుగా కొత్త సాఫ్ట్వేర్ వస్తోంది. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇకపై ఆన్ లైన్ విధానం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను జారీచేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రోటోకాల్ దర్శనాలు మినహా మిగిలిన సిఫార్సుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి అర్హత కలిగిన వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రోజుకు రెండు వేల టికెట్లకు పైగా జారీ చేస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పరిమితంగా కుదించి ఆన్లైన్లో మంజూరు చేయాలని భావిస్తున్నారు. దరఖాస్తులు కూడా ఆన్లైన్లో స్వీకరించే వ్యవస్థని రూపొందిస్తున్నారు. తద్వారా తిరుమల కొండపై ప్రైవేటు పిీఆర్వోల ముసుగులో ఉన్న దళారీ వ్యవస్థను అడ్డుకట్ట వేయవచ్చని ఆలోచన.
ఇటీవలి కాలంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 65 మంది దళారీలను అరెస్టు చేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందాలంటే సంబంధిత ప్రముఖులు ముందురోజే సిఫార్సు లేఖలు తిరుమల జేఈవో కార్యాలయంలో సమర్పించాల్సి రావడం, వాటికి ఐడీ కార్డులు, వేలిముద్రలు పొందుపరచాల్సి రావడం తదితర తతంగమంతా ఉంటుంది. ఇవన్నీ వీఐపీలెవరూ నేరుగా చేయరు. తమ ప్రతినిధుల ద్వారా చేయిస్తారు. ఇక్కడే దళారులు ఎంటరవుతున్నారు. పీఆర్వోల ముసుగులో దళారులు యధేచ్చగా తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిత్యం సిఫార్సు లేఖలను తిరుమలకు పంపిస్తుంటారు. తమ వారికి దర్శనాలు చేయించాలని కోరుతూ సిఫార్సులు చేస్తుంటారు. ఇదే అదునుగా ప్రైవేటు పిఆర్వోలు తమ చేతివాటం చూపిస్తూ ప్రముఖుల సిఫార్సు లేఖలు కలర్ జిరాక్స్ చేసుకొని తిరుమలలోని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ కార్యాలయాల్లో ఉన్న టీటీడీ సిబ్బందితో కుమ్మక్కై విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్లో స్వామివారి దర్శనం టికెట్లను విక్రయిస్తున్నారు. తిరుమలలో ఇటీవలి కాలంలో కొన్ని మోసాలు వెలుగుచూశాయి. కొంతమంది టీటీడీ సిబ్బందిని ఈ కారణంగానే బదిలీ చేశారు.
మరోవైపు తిరుమలలో పనిచేసే కొంతమంది మీడియా ప్రతినిధులు టీటీడీ మంజూరు చేస్తున్న బ్రేక్ దర్శనం టిక్కెట్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితులు అన్నింటికీ చెక్ పెట్టే విధంగా ఇకపై శ్రీవారి దర్శనానికి స్వీకరించే సిఫార్సు లేఖలను ఆన్లైన్ ద్వారానే చేపట్టేలా పారదర్శకమైన కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధత అవుతున్నారు. త్వరలోనే పాలక మండలి ఏర్పడిన తర్వాత జరిగే తొలి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.