హైదరాబాద్ శివారు దూలపల్లిలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసును రోజుల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. కేసులో ప్రేమించిన యువతి సోదరుడు దీన్ దయాల్ ప్రధాన నిందితుడని తేలింది.
హరీశ్ బావమరిదితో పాటు అతనికి సహకరించిన మరో పది మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న బ్యాండ్ వెంకట్ అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. గతంలో హరీశ్ అమీర్ పేట్ లోని ఎల్లారెడ్డిగూడెంలో ఉంటున్నప్పుడు జియాగూడకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించినట్లు స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో తన చెల్లి వెంటపడొద్దని యువతి సోదరుడు హరీశ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో హరీశ్.. ఎనిమిది నెలల క్రితం సూరారం ప్రాంతానికి నివాసం మార్చాడు. అక్కడే స్థలం కొనుగోలు చేసి తల్లితో కలిసి అదే ప్రాంతంలో అద్దెకి ఉంటూ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. అయితే హత్య జరగడానికి ఆరు నెలల ముందు హరీశ్ తో యువతి సోదరుడు దీన్ దయాల్ గొడవ పడ్డాడు.
మరోసారి తన చెల్లి జోలికి రావద్దని, కలవకూడదని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా హరీశ్, యువతి కలిసేవారు. వీరు కలిసే విషయం తాను ప్రేమించిన యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు సైతం హరీశ్ ను బెదిరించారు. ఈక్రమంలోనే గత శుక్రవారం సూరారం ప్రాంతంలో హరీశ్ ఫోటోతో రెక్కీ నిర్వహించిన తర్వాత.. యువతి సోదరుడు దీన్ దయాల్ తో పాటు అతని స్నేహితులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో దారుణంగా నరికి చంపి వెళ్లిపోయారు.
అయితే సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిచ్చిన సమాచారం మేరకు మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.