దేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న భారీ హెరాయిన్ షిప్మెంట్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను భారత్, శ్రీలంకలో అమ్మడానికి ఒక ఇరానియన్ బోటులో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీన్నుంచి ఒక శ్రీలంక బోటులోకి ఈ మాదక ద్రవ్యాలను తరలించాల్సి ఉందని, సదరు బోటును ట్రేస్ చేయడం కష్టంగా మారి ఉండేదని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తెలిపారు.
భారత నేవీతో కలిసి ఆపరేషన్ చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఈ మాదక ద్రవ్యాల షిప్మెంట్ను పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని కేరళలోని కోచి తీసుకొచ్చారు. అలాగే ఆరుగురు ఇరానియన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలు ముందుగా పాకిస్తాన్ వెళ్లాయని, అక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల ప్యాకెట్లపై ఉన్న గుర్తులు, ప్యాకింగ్ విధానం ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లలోనే జరుగుతుందని వాళ్లు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల విలువ మార్కెట్లో రూ.1200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
పాక్ పడవలో…
గుజరాత్లో కచ్ తీరంలో ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ జరిపిన సంయుక్త ఆపరేషన్లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్కు చెందిన ఓ పడవలో వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి.. పడవను సీజ్ చేశారు. ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేసారు.