కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని జమ్ము కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది 42 మంది విదేశీ ఉగ్రవాదులను మట్టు పెట్టామన్నారు. మొత్తంగా 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు.
లోయలో ఉగ్ర సంస్థల్లో చేరే యువత సంఖ్య 37 శాతానికి తగ్గిందన్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు, భద్రతా బలగాల దాడులపై ఆయన ట్వీట్ చేశారు. ఈ ఏడాది భద్రతా బలగాలు 93 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ చేపట్టాయని చెప్పారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో 108 మంది లష్కర్-ఏ-తొయిబా, 35 మంది జైషే మహమ్మద్, 22 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్, నలుగురు ఆల్ బాద్ర్, ముగ్గురు అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొన్నారు.
అదే సమయంలో ఎదురు కాల్పులు, ఉగ్రవాద దాడుల్లో జమ్ముకశ్మీర్ పోలీసులు 16 మంది, భద్రతా దళాల జవాన్లు 26 మంది మరణించినట్టు తెలిపారు. ఉగ్రదాడుల్లో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 100 మంది యువకులు ఉగ్ర సంస్థల్లో చేరారన్నారు. గతేడాది కన్నా ఇది 37 శాతం తక్కువన్నారు.
వారిలో లష్కరే తొయిబాలో 76 మంది చేరారని వివరించారు. కొత్తగా ఉగ్రవాద సంస్థల్లో చేరిన వారిలో 65 మందిని ఎన్కౌంటర్లలో మట్టుపెట్టామన్నారు. 17 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామన్నారు. 18 మంది ఇంకా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు.