మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న ఛీతా కూన మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల అనే ఆడ ఛీతాకు గత మార్చ్ నెలలో నాలుగుకూనలు పుట్టాయి. అయితే వీటిలో ఒకటి మంగళవారం మృతి చెందిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
దీని మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. ఇప్పటికే ఈ నేషనల్ పార్క్ లో మూడు ఛీతాల మరణంతో తలలు పట్టుకుంటున్న అధికారులకు ఈ పిల్ల ఛీతా మృతి మరో సమస్య తెచ్చిపెట్టింది.
కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరుపైనా, సమర్థత పైనా అనుమానాలు తలెత్తాయంటున్నారు. ఇక్కడి ఈ జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు ఉండవచ్చునని నిపుణులు తాజాగా భావిస్తున్నారు.
మూడు నెలల కాలంలో సషా, ఉదయ్, దక్ష అనే ఛీతాలు ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో దక్ష తీవ్ర గాయాలకు గురై మృతి చెందింది. ప్రస్తుతం ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 17 ఛీతాలు, మూడు కూనలు ఉన్నాయని, వీటినైనా జాగ్రత్తగా సంరక్షించుకోవలసి ఉందని సిబ్బంది చెబుతున్నారు.