థాయ్లాండ్ లోని ఓ డే కేర్ సెంటర్ లో ఓ ఉన్మాది రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మాజీ పోలీసు అధికారి అయిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు.
ఈ కాల్పుల్లో 24 మంది చిన్నారులతో పాటుగా మొత్తం 34 మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ మారణహోమం నుంచి ఒకే ఒక్క చిన్నారి ఒక్క చిన్న గాయం కూడా లేకుండా బయటపడింది. పిల్లలందరితో పాటు తమ కుమార్తె కూడా చనిపోయి ఉంటుందని ఆందోళన చెందిన ఆ పాపకి ఈ విషయం ఒకింత ఆశ్చర్యానికి కలిగించినప్పటికీ కూతురుని చూసుకొని ఆ తల్లి ఉప్పొంగిపోతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే కాల్పులు జరిగిన సమయంలో గదిలో ఓ మూలన ఈ చిన్నారి గాఢ నిద్రలో ఉంది. ఆ నిద్రే ఆ పాప పాలిట వరం అయ్యింది. మూడేళ్ల ఆ పాప పేరు పవీనట్ సుపొల్వాంగ్. మారణహోమం జరిగిన సమయంలో ఆమె గాఢంగా నిద్రపోతోందని, ఆమెపై నిండుగా దుప్పటి కప్పి ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే ఆమె ప్రాణాలను కాపాడినట్లు భావిస్తున్నారు. తాను ఇంకా షాక్లోనే ఉన్నానని చిన్నారి తల్లి పనోమ్పాయ్ సితోంగ్ తెలిపింది.ఈ ఘటనలో చనిపోయిన చిన్నారుల్లో 11 మంది ఆ పాప నిద్రిస్తున్న గదిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మారణహోమం అనంతరం నిందితుడు తనను కాల్చుకొని మరణించిన తర్వాత పోలీసులు ఆ డేర్ కేర్ సెంటర్లో గదులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారు. గదిలోని ఒక మూలలో కదలికల ఆధారంగా ఆ పాప బతికున్నట్లు గుర్తించారు. ఇతర పిల్లల మృతదేహాలతో పాటు తమ పాప ముఖంపై దుప్పటి కప్పి తీసుకొచ్చారని పాప తల్లి తెలిపారు.నా బిడ్డ బతికి ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇతర పిల్లల కుటుంబాలను చూస్తే చాలా బాధేస్తోంది. ఇది విచారకరమైన ఘటన’ అని ఆ తల్లి చెప్పింది. ఈ విషాదం గురించి తమ కుమార్తెకు జ్ఞాపకం లేకపోవచ్చని ఆమె చెప్పింది. ఈ ఘటనలో చిన్నారి బెస్ట్ ఫ్రెండ్ అయిన రెండేళ్ల టెకిన్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని మాత్రం తమ పాపకు చెప్పామని సితోంగ్ తెలిపారు.
తమ పాప సాధారణంగా చిన్నపాటి అలికిడి అయినా నిద్రలేస్తుందని.. ఆ రోజుమాత్రం గాఢ నిద్రలో ఉందని పాప తల్లి సితోంగ్ చెప్పారు. ‘వాళ్ల బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. పాప ప్రాణాలతో బయటపడటాన్ని ఓ అద్భుతంగా అభివర్ణించారు.