బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 25వ రోజు కొనసాగుతోంది. మండుటెండలో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు బండి. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గంలోని గంగాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గంగాపూర్ నుంచి గోపులాపూర్ గేట్, లింగంపేట మీదుగా కొడుగల్ వరకు సాగనుంది.
ప్రధాని మోడీ ఆదేశాలతో ముందుకు వెళ్తున్న బండికి అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు బీజేపీ శ్రేణులు, ప్రజలు, రైతులు, నిరుద్యోగులు. ప్రజా సంగ్రామ యాత్ర గంగాపూర్ లో 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా బీజేవైఎం నేతృత్వంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ.. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు బండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేస్తున్నారు.
పాదయాత్రలో భాగంగా సంజయ్ పై పూలవర్షం కురిపిస్తున్నారు బీజేపీ శ్రేణులు. అటు ప్రధాన కూడళ్ళలో గజమాలలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు యువత, నిరుద్యోగులు.