చార్ ధామ్ లో భక్తుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి (మే3) నుంచి శుక్రవారం వరకు దాదాపు 31 మంది భక్తులు మరణించారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట, ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో చార్ ధామ్ యాత్ర మార్గాల్లో భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డా. శైలజ భట్ వివరించారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తేలితే వారు విశ్రాంతి తీసుకోవాలని, పరిస్థితి మెరుగుపడ్డాకే యాత్రలో పాల్గొనాలని ఆమె సూచనలు చేస్తున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరిచి చార్ధామ్ యాత్రను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ నెల 6న కేదార్నాథ్, 8న బద్రీనాథ్ ఆలయాలను తెరిచారు.