భారత ప్రధాని నరేంద్రమోదీ 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్టేడియంలో ఎక్కడ చూసినా నలుపు,తెలుపు గడులు కనిపించేలా తీర్చిదిద్దారు. భారీ చెస్ పావులను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగడం వల్ల రష్యాపై వేటు పడింది. అనూహ్యంగా ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ దక్కించుకుంది. దీంతో పోటీలకు చెన్నై వేదిక అయ్యింది. తమిళనాడు ప్రభుత్వం పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో.. ఓపెన్, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్ ఆరు జట్లను బరిలోకి దించుతోంది. తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. ద్రోణవల్లి హారిక ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పటికీ పోటీల్లో పాల్గొంటుండటం విశేషం.
చెస్ ఒలింపియాడ్ రష్యా, చైనా బరిలో లేనందున స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ఇంకా ఉక్రెయిన్, హంగేరీ, నార్వే కూడా బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ఛాంప్ కార్ల్సన్ నార్వే జట్టుకు ఆడుతున్నాడు. అతను టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఈసారి పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్.. భారత జట్లకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.