నేపాల్ లోని పొఖారా ఎయిర్ పోర్టు వద్ద కుప్ప కూలిన యతి విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో 32 మంది మృతదేహాలను కనుగొన్నారు. ఖాట్మండు నుంచి సుమారు 72 మందితో పొఖారా వెళ్తున్న ఈ విమానం ఇక్కడి రన్ వే వద్ద ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. మృతుల్లో అయిదుగురు భారతీయులున్నట్టు తెలుస్తోంది. ఇంకా 53 మంది నేపాలీలు, నలుగురు రష్యన్లు, ఓ ఐరిష్, ఇద్దరు కొరియన్లు,, ఇద్దరు పిల్లలు, అర్జెంటీనా, ఫ్రాన్స్ కు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఈ ఘోర దుర్ఘటనలో మృతి చెందినట్టు భావిస్తున్నామని ఎయిర్ పోర్ట్ అథారిటీకి చెందిన ఓ అధికార ప్రతినిధి తెలిపారు.
ఘటన జరిగిన ప్రాంతం వద్ద పెద్దఎత్తున మంటలు రేగి. పొగలు వస్తున్న కారణంగా సహాయక చర్యలు నిర్వహించడం కష్టతరంగా ఉందని ఆయన చెప్పారు. విమాన శిథిలాల కింద ఇంకా మృతులు ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్ ప్రచండ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. సహాయకచర్యలను సమీక్షించారు. పొఖారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ యతి ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన సుమారు 20 నిముషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఇప్పుడే చెప్పలేమని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు.
నిజానికి నేపాల్ లో విమాన ప్రయాణాల పట్ల, సేఫ్టీ పట్ల యూరోపియన్ యూనియన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి విమాన సిబ్బందికి తగినంత శిక్షణ లేదని పేర్కొంటూ .. 2013 లోనే ఫ్లైట్ సేఫ్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. నేపాల్ నుంచి వచ్చే అన్ని విమానాలు తమ గగనతల పరిధిలోకి రాకుండా బ్యాన్ విధించింది. లోగడ నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదాల్లో వందలాది మంది దుర్మరణం పాలయ్యారు. గత ఏడాది మే 22 న నేపాలీ క్యారియర్ టాటా ఎయిర్ లైన్స్ వారి విమానం కూలిపోగా నలుగురు భారతీయులతో బాటు 16 మంది నేపాలీలు మరణించారు.