ఏపీలోని ఉన్నతాధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష విధించింది. అయితే, వారు క్షమాపణలు కోరటంతో.. జైలు శిక్షను విరమించింది. ధర్మాసనం శిక్ష విధించిన వారిలో విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్ ఉన్నారు.
ఐఏఎస్ల క్షమాపణలను అంగీకరించిన ధర్మాసనం.. జైలు శిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్కు వెళ్లి సొంత ఖర్చులతో సేవ చేయాలని ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్లో ఒక్కపూట భోజనం పెట్టాలని హైకోర్టు పేర్కొంది. అలాగే, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఎనిమిది మంది ఐఏఎస్లను హైకోర్టు ఆదేశించింది.
ప్రధానంగా గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడాన్ని హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. న్యాయస్థానం ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన ధర్మాసనం గురువారం విచారణను ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
అయితే హైకోర్టుకు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఐఏఎస్ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు… జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు సేవ చేయాలని ఆదేశించింది.