ఒకప్పడు ప్రతీఊళ్ళోనూ కోర్టు ఉండేది. అదేనండి రచ్చబండ..! ఇప్పటి కోర్టుల్లా తీర్పులు సంవత్సరాలకు సంవత్సరాలు సాగదీయడం కాదు. రెండు మూడు గంటల్లోనే తగవులు తేలిపోయేవి. కాకపోతే ఆ న్యాయం దోషిగా నిలబడ్డ సామాజిక పరిస్థితిమీద, తీర్పు ఇచ్చే వ్యక్తి తెలివి, విజ్ఞతుల మీద ఆధారపడి ఉండేది.అయితే ఇప్పటికీ అక్కడక్కడా ఇలాంటి రచ్చబండలు నడుస్తున్నాయి.
అయితే కొన్నిచోట్ల తీర్పులు పేరుతో దురాచారాలను, వారివారి పైత్యాలను ప్రజలపై రుద్దుతున్నారు. తీర్పు ఇచ్చే పెద్దమనుషులే అమాయక ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తి అంటగట్టిన వివాహేతర బంధాన్ని నిరూపించుకోవాలంటూ అమాయకుడికి అగ్నిపరీక్ష పెట్టి బతికుండగానే గ్రామపెద్దలు నరకం చూపించారు.ములుగు మండలం బరిగెలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్..ఊళ్లలో వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి గంగాధర్పై ఆరోపణలు చేశాడు. ఈ వివాదంపై రంగప్రవేశం చేసిన గ్రామంలోని పెద్దమనుషులు..నిజం నిరూపించుకోవాలని గంగాధర్కు హుకుం జారీచేశారు.
మంటల్లో గడ్డపారను ఎర్రగా కాల్చి దానిని పట్టుకోవాలని.. చేతులు కాలితే తప్పు చేసినట్లని, అందుకు 4లక్షల రూపాయలు ఇవ్వాలని తెల్చిచెప్పారు. చేతులు కాలని పక్షంలో తప్పుచేయనట్లేనని.. అందుకు ఆరోపణలు చేసిన వ్యక్తి 4లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు.
ఓ వైపు పెద్దమనుషులు ఒత్తిడి.. మరోవైపు తనపై పడిన నిందను భరించలేని గంగాధర్ ఇక ఎర్రగా కాలిన గడ్డపలుగును పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. గత నెల 25న గ్రామ సమీపంలోని లక్నవరం సరస్సు వద్దకు తీసుకువెళ్లి మంటలు పెట్టారు.
అందులో గడ్డపలుగును ఉంచి..ఎర్రగా కాల్చారు. చెరువులో స్నానం చేసిన గంగాధర్.. తడి దుస్తులతో పెద్దమనుషులు సమక్షంలో మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో బయటికి తీశాడు. త్వరగా తీసి బయట పడేయటంతో గంగాధర్ చేతులకు అంతగా గాయాలు కాలేదు.
గంగాధర్ గడ్డపారను మంటల్లో నుంచి తీసినప్పటికీ పెద్దమనుషులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఏదేమైనా ఆరోపణలు చేసిన వ్యక్తికి 4లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.
ఇక చేసేదేమిలేక గంగాధర్ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు. తనపై తప్పుడు నిందలు మోపి.. తన జీవితంతో ఆడుకుంటున్నారని గంగాధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు