కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్ హల్చల్ చేసింది.సముద్రం, నదీ జలాల్లో జల్సాచెయ్యాల్సిన డాల్ఫిన్ పిల్లకాలువలో పచారీలు చేస్తోంది. పెదపూడి లోని బిక్కవోలులో ఓ డ్రైనేజీలో కనిపించిన ఈ డాల్ఫిన్ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఈ డాల్ఫిన్ సముద్రం నుంచి ఉప్పుటేరుద్వారా ఏలూరులోని పిల్ల కాల్వలోకి ప్రవేశించింది.
కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో నీటిలో ఆడుతున్న డాల్ఫిన్ ను గుర్తించిన స్థానిక మత్స్యకారులు సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. ఈ వార్త ఆనోటా ఈనోటా ఆ ప్రాంతమంతా పాకింది. దాంతో డాల్ఫిన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
మత్స్యకారుల సహాయంతో డాల్ఫిన్ను సముద్రంలో వదిలేందుకు ప్రయత్నించారు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే..డాల్ఫిన్ను సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో వదిలే సమయానికి అది మృతి చెందింది. దాంతో పశుసంవర్ధకశాఖ వైద్యులతో పంచనామా జరిపించి పూడ్చిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.