ఆఖరి నిజాం మనమడు ముకర్రమ్ ఝూ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి అన్నారు. అలా చేస్తే తెలంగాణ పోరాటాల చరిత్రను, నిజాం వ్యతిరేక పోరాటంలో నాటి ప్రజలు చేసిన త్యాగాలను అవమానించినట్లే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం వారసత్వాన్ని అధికారికంగా గుర్తించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. నాటి హైదరాబాద్ సంస్థానంలోని హిందువుల మాన ప్రాణాలపై నిజాం రజాకార్లు సాగించిన మారణ హోమాన్ని ఎన్ని తరాలు మారినా ఇక్కడి ప్రజలు మర్చిపోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మహిళల బట్టలు విప్పి బతుకమ్మ ఆడించిన నీచ చరిత్ర నిజాం రాజుది అని విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎలా మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో కార్యక్రమం కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో త్యాగాలు చేసిన వారి సేవలను కొనియాడరని ఆయన చెప్పారు.
ఇలాంటి సంఘటనలు అన్ని కూడా మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిజాం వారుసుడికి అధికారిక అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గమని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చర్య ఈ ప్రాంత ప్రజలు సాగించిన స్వాతంత్య్ర పోరాటాన్ని అగౌరవ పరిచేలా ఉందన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్య వల్ల తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని.. లేదంటే మధ్య పాకిస్తాన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసేందుకు నిజాం కుట్రలు పన్నిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఎమ్ఐఎమ్ ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ప్రజల త్యాగాలను కించపరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు. ముకర్రమ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.