భార్య సహకారంతో మత్తు మందుచల్లి బాలిక పై అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో చోటుచేసుకుంది. కొలనుకొండ గ్రామంలో నివాసం ఉండే ఖాశింవలి, అతని భార్య రసూల్బీ స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తారు. బాధిత బాలిక తల్లి, వారి కుటుంబసభ్యులు పూసలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బాధిత బాలికను ఖాశిం వలి ఈ ఏడాది రంజాన్ మాసంలో తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్డ్రింక్లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపడటంతో మత పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అనంతరం బాలికను వేరే ప్రాంతంలోని మదరసాకు తరలించారు. ఈ నెల 22న బాలిక తల్లికి ప్రమాదం జరిగిందని మదరసా వద్దకు వెళ్లి ఖాశిం వలి ఆ బాలికకు తెలిపాడు.
ఈ విషయాన్ని బాలిక మదరసా పెద్దలకు చెప్పడంతో వారు నమ్మలేదు. దీంతో బాలిక గోడ దూకి వచ్చి ఖాశిం వలితో కొలనుకొండ వచ్చింది. బాలిక వారి నుంచి తప్పించుకుని విజయవాడకు వెళ్ళగా, స్వచ్ఛంద సంస్థకు చెందినవారు ఆమె నుంచి వివరాలు సేకరించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు బాలిక బంధువులు, తల్లికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఖాశింవలిని అదుపులోకి తీసుకున్నారు.