బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుపాను వల్ల తీరప్రాంతం అలజడిగా మారింది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. తుపాను కారణంగా ఓ మందిరం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది.
సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు వద్దకు విదేశాలకు చెందిన బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం కొట్టుకొచ్చింది. ఈ రథంపై 16-1-2022 తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది థాయిలాండ్ లేదా మలేషియా లేదంటే జపాన్ దేశాలకు చెందినదై ఉండొచ్చని కొందరు మత్స్యకారులు చెప్తున్నారు.
హుదూద్, తిత్లీ వంటి పెను తుపానులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ కొట్టుకురాలేదంటున్నారు స్థానికులు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతికి లోనవుతున్నారు. దాన్ని చూడటానికి స్థానికులు తీర ప్రాంతానికి పోటెత్తారు. ఈ రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడి నుండి కొట్టుకొచ్చింది అనే కోణం విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.