ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అర్హత లేని సినిమాలను ఆస్కార్కి పంపిస్తున్నారు అంటూ బాధ పడ్డాడు. ఇండియా నుంచి రెండు ఆస్కార్ లను ఒకేసారి అందుకొని సంచలనం సృష్టించాడు రెహమాన్. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను రెహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టి ఒకేసారి అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంది. అయితే ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచేందుకు పెద్ద కథే జరిగింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో ఆదరణ పొందింది. పాపులారిటీ మాత్రమే కాదు ఆస్కార్ కి వెళ్లే అర్హత కూడా ఉండడంతో.. భారత్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపిస్తుంది అని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ ని కాదని గుజరాతీ సినిమా లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. అయితే ఆ సినిమా స్థానం దక్కించుకోలేక వెనక్కి తిరిగి వచ్చింది.
ఇక ట్రిపుల్ ఆర్ ని ఎంపిక చేయకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం పై హాలీవుడ్ మీడియా కూడా ప్రశ్నించింది. అయితే ఆర్ఆర్ఆర్ టీం మాత్రం వెనకడుగు వెయ్యకుండా సొంతంగా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది. నామినేట్ అవ్వడమే కాదు ఆస్కార్ ని కూడా అందుకొని చరిత్ర లిఖించింది.
ఆర్ఆర్ఆర్ భారత్ ప్రభుత్వం నుంచి అధికారికంగా వెళ్లి ఉంటే బెస్ట్ మూవీ క్యాటగిరీ నామినేషన్స్ లో కూడా స్థానం దక్కించుకునేది అంటూ కొందరు అభిప్రాయం పడుతున్నారు. తాజాగా ఎఆర్ రెహమాన్ కూడా ఈ విషయాన్ని ఉద్దేశిస్తూనే ఇన్డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. ”మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. అర్హత లేని సినిమాలను పంపిస్తున్నారు అనిపిస్తుంది. బాధ అనిపిస్తున్నా, చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోతున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.