తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ పై ఇటీవల హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
ఎమ్మెల్సీ కవిత పై బండి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బండి సంజయ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఇటీవలే ఫిర్యాదు చేశారు.
అలాగే బండి సంజయ్ చేసి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించడం.. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై తాజాగా బంజారాహిల్స్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు పంపారు. రేపు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు. ఇటీవల కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా… అంటూ బండి సంజయ్ కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆరఎస్ లో మరికొంత మంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు బండి. ఇక ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది.