9వ తరగతి విద్యార్థి రాసిన లేఖ చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను రోజూ స్కూల్కి మందు తాగి వస్తున్నట్లు అందులో రాశాడు. సిగరెట్లు కూడా కాల్చుతున్న అని, స్కూల్ పక్కనే ఉన్న మద్యం షాపులోనే మందు కొంటున్నట్లు పేర్కొన్నాడు. ఇది చూసిన ఉపాధ్యాయులకు మతిపోయినట్లైంది. ఇంతకి ఈ ఘటన ఎక్కడో కాదండి తూర్పగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పి.గన్నవరం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలతో 9వ తరగతి చదివే ఓ విద్యార్థి మద్యం తాగి స్కూల్ వస్తున్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ విషయై ఆ విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. అయితే, అందుకు వారు బదులిస్తూ.. ఇంటి వద్ద తామెంత చెప్పిన వినటం లేదని, మీరైనా చెప్పి తమ కుమారుడిని దారిలో పెట్టాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు.
ఇది జరిగిన తర్వాత ఆ విద్యార్థి ఉపాధ్యాయులకు ఓ లేఖ రాశాడు. పి.గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నానని, ఇందుకు అవసరమయ్యే డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్టు వివరించాడు. అయితే, ఇకపై మాత్రం ఇలా చేయనని హామీ ఇస్తూ ఆ లేఖలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
‘‘అవును నేను రోజూ మద్యం తాగి స్కూలుకొస్తున్నా. బడి దగ్గర్లోనే ఉన్న దుకాణంలో సిగరెట్లు కొని కాలుస్తున్నా. డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనిచేస్తున్నా. కానీ ఇకపై మాత్రం ఇలా చేయను’’ అని లేఖలో పేర్కొన్నాడు. ఇది చదివిన ఉపాధ్యాయులు షాకయ్యారు.
చదువుకోవాల్సిన వయసులో స్కూల్ విద్యార్థులు ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇదే స్కూలులో మొత్తం ఐదుగురు విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు బానిసలయ్యారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.