ఏపీలో పన్నుల బాదుడుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. లక్షలకు లక్షలు పన్నులు విధిస్తూ ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని.. ఓ వైపు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అధికారులు తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను విధించింది నగరపాలక సంస్థ. పర్లోవపేటలో 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటికి.. గతం నుంచి ఇంటి పన్ను బకాయి ఉంది.
దీంతో.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను చెల్లించాలంటూ.. తాజాగా అధికారులు నోటీసు ఇవ్వడంతో ఇంటి యజమాని దిప్పాడ వెంకన్న.. అతని కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. చేపల వేట సాగించి జీవనం సాగించే తాము.. అంత డబ్బు ఎలా చెల్లించాలని వాపోతున్నారు.
ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేశారని.. శిధిలావస్థకు చేరిన ఇంటికి అంత పన్ను వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పు చేసి రూ.5 వేలు చెల్లించినా నీటి సరఫరా పునరుద్ధరించటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.