ఏపీ సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో దారుణ ఘటన జరిగింది. కంటి చూపు లేని ఓ బాలికను రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిలోని కంటి చూపులేని ఎస్తేరు రాణి (17) అనే బాలిక ఇంట్లోనే ఉంటుండగా, తల్లి కూలిపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న రాజు అనే యువకుడు.. బాలికపై కన్నేశాడు.
అప్పుడప్పుడూ బాలిక ఇంటికి వచ్చి మాట్లాడుతుండటంతో స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాజు వేధింపులు క్రమక్రమంగా పెరగడంతో బాలిక తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది.
దీంతో రాజును తల్లి నిలదీయడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న యువకుడు.. అక్కడే ఉన్న గొడ్డలితో బాలికపై దాడి చేసి నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
ఘటన జరిగిన వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కళ్లు కనిపించని తమ బిడ్డని చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.