డబ్బుకోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళ. తాగొచ్చి తనను హింసిస్తున్న భర్తను చంపేస్తే అతని అడ్డుతొలగడంతోబాటు అతని ఉద్యోగం కూడా తనదవుతుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది.వివరాల్లోకి వెళ్తే ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గాంధీకాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్(50) కొత్తగూడెం కలెక్టరేట్లో అటెండర్ గా పనిచేస్తున్నారు. ఈయన తన భార్య సీతామహాలక్ష్మి(43),తనయుడు సాయికుమార్ తో కలిసి స్థానికంగా నివాసముంటున్నారు.
గతనెల 29వ తేదీన అర్థరాత్రి తన భర్త వంటింట్లో జారిపడ్డాడని,తలకు తీవ్రగాయమైందని భార్య సీతామహాలక్ష్మి జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది.కొన్ని గంటల తర్వాత ఆయన మృతి చెందాడు. అయితే..సాయికుమార్ కి తండ్రి మరణంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు. మరోవైపు భర్తని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. దాంతో ఆమెపై నిఘాపెట్టారు.
మంగళవారం రాత్రి ఆమె హైదరాబాద్ కి పారిపోయేందుకు, కొత్తగూడెం రైల్వేస్టేషన్ కు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్ కి వెళ్ళి ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో భాగంగా..తానే భర్తని చంపానని పేర్కొంది.ఆరోజు రాత్రి తన భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడని,నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టానని తెలిపింది.
భర్తతాగొచ్చి నిత్యం తనని వేధించేవాడని తెలిపింది. వేధింపులు తప్పడంతోబాటు పాటు కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్లు అంగీకరించింది.