ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో మకాలు పర్వతం ఒక్కటి. దాని ఎత్తు 8463 మీటర్లు ఉంటోంది. ఈ పర్వతాన్ని ఓ యువతి అలవోకగా ఎక్కి జాతీయ రికార్డ్ నమోదు చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని భట్వాడి బ్లాక్ లోంథ్రూ గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు సవిత కన్స్వాల్ కి చిన్నతనం నుండే పర్వతాలు ఎక్కడం అంటే ఇష్టం.
ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సవిత.. ఉత్తరకాశీలోని నెహ్రూ పర్వతారోహణ ఇన్స్టిట్యూట్ లో బేసిక్ కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత వర్సిటీలోనే శిక్షకురాలిగా విధులు నిర్వర్తించింది. పర్వతారోహణలో జాతీయ రికార్డు నెలకొల్పటంపై వర్సిటీ ప్రధానాధ్యాపకులు అమిత్ బిస్త్, పర్వతారోహకులు విష్ణు సెమ్వాల్ సహా పర్వతారోహణ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.
ఎవరెస్ట్, మకాలు పర్వతాలను అధిరోహించటం కంటే ముందే పలు పర్వతాలను చుట్టేసింది సవిత. ఇప్పటికే.. 7120మీటర్ల ఎత్తుగల త్రిశూల్ పర్వతం, 5930 మీటర్ల ఎత్తున్న హనుమాన్ టిబ్బా, 5400 మీటర్ల ఎత్తు గల కొలహాయ్, 5680మీటర్ల ఎత్తున్న ద్రౌపది దండా, 5500మీటర్లు గల తులియాన్ పీక్ పర్వతాలను అధిరోహించింది సవిత.
అంతేకాకుండా.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద శిఖరం.. 8516 మీటర్ల ఎత్తుగల లోట్సే పర్వతాన్ని సైతం అధిరోహించి రికార్డుకెక్కింది. పర్వాతారోహణలో రికార్డులు నెలకొల్పిన ఆమె కుటుంబం ఇప్పటికీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. తనకు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఇంకా గొప్ప గొప్ప రికార్డులు సృష్టిస్తానని చెప్తోంది సవిత.