ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తారు భక్తులు. తగిన సదుపాయాలు లేకపోతే భక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.పసిపిల్లలు, వయోవృద్ధులు,దివ్యాంగుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. భక్తులకు సౌకర్యాలు కల్పించే పుణ్యక్షేత్రం…భక్తులకు భాగ్యమే అవుతుంది. అయితే అలాంటి క్షేత్రాల్లో శిర్డీ ఒకటి.
ఇప్పుడు శిర్డీబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తులకు శుభవార్త చెప్పింది. సాయి దర్శనం కోసం భక్తులు వేచిచూసే మార్గంలోని ఏసీ సదుపాయం కల్పించనుంది. రూ.109 కోట్ల వ్యయంతో భారీ కాంప్లెక్స్ నిర్మాణం సహా భక్తులకు ఉపయోగపడేలా ఇతర సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపింది. సౌకర్యవంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు సాయి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లుగావించునుందని తెలిపింది.
శిర్డీలోని ఆలయ ప్రాంగణంలో 2,07000 చ.అ. ల విస్తీర్ణంలో సాయిదర్శన కాంప్లెక్స్ నిర్మిస్తాం. రెండంతస్తుల్లో ఈ భవనం ఉంటుంది. ఈ దర్శన కాంప్లెక్స్ లో 12 ఏసీ గదులు ఉంటాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.
భద్రతకోసం 200 సీసీటీవీ కెమెరాలు అమర్చుతాం. మొత్తం రూ.109.50 కోట్లతో ఈ కాంప్లెక్ నిర్మాణం పూర్తిచేస్తామని సాయి సంస్థాన్ ట్రస్ట్ డిప్యూటీ ఎగ్జిగ్యూటివ్ అధికారి రాహుల్ జాదవ్ తెలిపారు.
మరోవైపు,శిర్డీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాథాకృష్ణ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది మే నాటకి టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
కొత్త టెర్మినల్ భవనం కోసం రూ.350 కోట్లను ప్రభుత్వం కేటాయించనుందని శిర్డీ విమానాశ్రయ నిర్వాహణ సంస్థ మహారాష్ట్ర డెవలప్ మెంట్ కంపెనీ తెలిపింది.సత్వరమే పనులను పూర్తి చెయ్యాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆదేశాలు జారీ చేసారని పేర్కొంది.
2017లో శిర్డీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అయితే ,ఇక్కడ రాత్రివేళ విమాన రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు లేవు. తాజా టెర్మినల్ నిర్మాణంతో రాత్రిపూట విమానాలు ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమవుతుందిని అధికారులు చెబుతున్నారు.