కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట మండలంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేయడానికి లోపలకు దిగిన కార్మికులు ఒక్కొక్కరుగా మృతి చెందారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ట్యాంకుల్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.
ఉదయం ఆరుగంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణకు వచ్చారు. పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. పాడేరుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరి అందకపోవడంతో లోపలకు జారిపోయాడు. అతడిని రక్షించేందుకు వచ్చిన నరసింహ, సాగర్లు కూడా అపస్మారక స్థితిలోకి చేరడంతో మిగిలిన వారు వారిని రక్షించేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు.
మృతులను రామారావు, ప్రసాద్ జగదీష్, వెచ్చంగి సాగర్, బొంజుబాబు, వెచ్చింగి కృష్ణ, వెచ్చంగి నరసింహలుగా గుర్తించారు.మృతుల్లో ఐదుగురిది పాడేరుగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులను పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరికి ఇటీవల వివాహం జరిగినట్లు సహచరులు చెబుతున్నారు.
కంపెనీ యాజమాన్యం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు భారీ పరిణామంలో ఉన్న వంట నూనెల ట్యాంకర్లను శుభ్రం చేసే పనుల్ని పాడేరు, పులిమేరులకు చెందిన వారికి అప్పగించారు. ఒక్కో ట్యాంకర్ శుభ్రం చేయడానికి నిర్ణీత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో విషవాయువులు పేరుకు పోవడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ట్యాంకర్లలో ఆక్సిజన్ పరిణామాన్ని గుర్తించకుండా కార్మికుండా కార్మికుల్ని పనిలోకి పురమాయించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలానికి పెద్దాపురం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో జగదీష్, ప్రసాద్ పులిమేరు గ్రామస్తులుగా గుర్తించారు.