నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో.. కామారెడ్డి 44వ నేషనల్ హైవేపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
అలాగే సెక్యురిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్ కు తరలించారు. సెక్యూరిటీ కారుకు మధ్యలో ఇంకో కారు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి.