అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోంది. పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది. స్ధానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు కలిసి టీడీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుని పోలీసులు సాయంతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్ని కాల రాశారు. అందుకే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.
అడ్డదారుల్లో,అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రులు నేరుగా రాజ్భవన్కు వెళ్ళాల్సిందేనని, రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించడంతో మంత్రులు, శాసనసభ్యులు, గ్రామాల మీద పడి దండయాత్ర చేశారు. అధికార పక్షం సృష్టించిన అరాచకానికి ప్రతిపక్షం అనేక చోట్ల నామినేషన్స్ కూడా వేయలేక పోయింది. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు.ఏం ఉద్దరించారని మీకు ఏకగ్రీవంగా ప్రజలు పట్టం కడతారు?
అధికారంలో ఉన్నవారు ప్రజలకు తాము చేసింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడుగుతారు.. కానీ వైసీపీ నేతలు బెదిరింపులతో ఓటు వెయ్యకపోతే ఊళ్లో ఉండరని, మీసంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, మీ ఇళ్లు కూల్చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు సిలువ వేశారు.