సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుంచి మంత్రి తలసాని ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సిటీలో దాదాపు 30 నుంచి 40 లక్షల వరకూ అక్రమంగా కట్టిన బిల్డింగులు ఉన్నాయని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ఆరుగురు 5వ అంతస్తులోనే చిక్కుకోవడంతో ఊపిరి ఆడక పొగ పీల్చుకొని..చనిపోయారని చెప్పారు.
వారంతా క్యూనేట్ అనే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. క్యూనేట్ సంస్థపై చాలా ఫిర్యాదులు సైతం ఉన్నాయన్నారు.అగ్ని ప్రమాదం పై ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నడుస్తోందన్నారు. పోస్టుమార్టమ్ పూర్తైన తర్వాత ప్రభుత్వ అంబులెన్సుల్లోనే వారి సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తరలిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని తెలిపారు.అయితే అగ్నిప్రమాదాలు 40 ఏళ్ల నాటి పాపమన్న తలసాని పాత బిల్డింగులు, ఫైర్ సేఫ్టీ లేని భవనాలు హైదరాబాద్ లో సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఉన్నాయని.. వీటిపై చర్యలు తీసుకోవాలంటే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.