వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో నటుడు నరేశ్ తరువాతే ఎవరైనా…ఓ సినిమా నిమిత్తం షూట్ చేసిన నరేశ్ – పవిత్రల పెళ్ళి వీడియో తన సొంత డబ్బులతో చేసుకున్న వీడియోగా ట్విట్టర్ లో ప్రమోట్ చేసాడు. అది కాస్తా వైరల్ అయ్యి పెళ్ళి భోజనాలు ఎప్పుడంటూ పాత్రికేయులు అడిగేదాకా వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పవిత్రతో ‘పెళ్లి వీడియో’ రిలీజ్ చేసి ఆశీస్సులు కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు నటుడు నరేశ్. అది వైరల్ అయింది.. దీంతో వీడియోపై నరేశ్ స్పందించాడు. హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో ‘ఇంటింటి రామాయణం’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు నరేష్ సమాధానం ఇచ్చాడు.
మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు? అన్న ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. తనకూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయని.. ప్రాథమికంగా తన జీవితం తాను అనుభవిస్తున్నానని చెప్పాడు.
త్వరలో పెళ్లి అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తాను మీడియాతో ఎల్లప్పుడూ మంచి స్నేహపూర్వకంగా ఉంటానని… అప్పటి దాకా ఓపిక పట్టండి అని సూచించాడు. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ఇంటింటి రామాయణం ప్రమోషన్ పక్కదోవ పడుతుందని చెప్పాడు.
అయితే శుక్రవారం ఉదయం.. ఆ వైరల్ వీడియోను నరేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్మీడియాలో ఆ వీడియా తెగ వైరల్ అయింది. తమ కొత్త ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా సాగడానికి.. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు నరేశ్ తెలిపాడు.
పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ పేర్కొన్న నరేశ్.. ‘పవిత్రనరేష్’ హ్యాష్ట్యాగ్ను జత చేస్తూ వీడియో విడుదల చేశారు. అయితే ఈ పెళ్లి వీడియో ఓ ప్రముఖ దర్శకుడు నిర్మిస్తున్న కొత్త సినిమాలోనిదని సమాచారం.
కొంతకాలంగా పవిత్రతో కలిసి ఉంటున్న నరేశ్.. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కూడా సినిమా వీడియోనేనని సమాచారం.
తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేందుకే నరేశ్ సినిమా వీడియోలను ట్విట్టర్ ద్వారా బహిరంగంగా విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.