సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నర్సింగ్ యాదవ్ పూర్తి పేరు మైలా నరసింహ యాదవ్. ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు.
1963 మే 15న హైదరాబాద్లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ బాషల్లో నటించారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి కేరక్టర్ చేశారు.
విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా MBBS, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవల చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు.
గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్కు డయాలిసిస్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి ఆయన మృతిచెందారు.