వివాహేతర సంబంధం నేరం కాదని గతంలో ఇచ్చిన తీర్పుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు, సాయుధ దళాల చట్టంలోని నిబంధనలకు ఎలాంటి సంబంధమూ లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఐపీసీలోని సెక్షన్ 497ను కొట్టివేసింది. దీనిపై తాజాగా ఈ తీర్పుపై సుప్రీం కోర్టును కేంద్రం ఆశ్రయించింది.
వివాహేతర సంబంధం నేరం కాదన్న కోర్టు తీర్పు నేపథ్యంలో అలాంటి ఘటనలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఆటంకాలను కలిగిస్తుందని కేంద్రం పేర్కొంది. అలా జరిగితే దళాలకు సంబంధించిన సేవల్లో అస్థిరతకు దారి తీస్తుందని చెప్పింది.
ఈ తీర్పుతో సైనిక సిబ్బంది ఆందోళనకు గురవుతారని కేంద్రం కోర్టుకు నివేదించింది. ఇంటికి దూరంగా ఉంటూ సవాళ్లతో కూడిన ఉద్యోగం చేస్తున్న ఆర్మీ సిబ్బందిలో కుటుంబం సభ్యుల పట్ల అభద్రతా భావం కలుగుతుందని వెల్లడించింది.
2018లో జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టును కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ కోరారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సిటి రవికుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న అధికారులపై సాయుధ దళాలు చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 రాజ్యాంగబద్ధతపై ఎన్ఆర్ఐ జోసెఫ్ షైన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వ్యభిచారం నేరం కాదని పేర్కొంది. దీన్ని నేరంగా పరిగణించే గత తీర్పులన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసింది.