చేయని నేరానికి ముందుగా దొంగ అని ముద్ర.. తరువాత పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు రోజుల పాటు స్టేషన్లో థర్డ్ డిగ్రీ.. అయ్యో.. దొంగ కాదని తెలుసుకున్న పోలీసులు.. ఎక్కడ అడ్డంగా బుక్ అవుతామని కవరింగ్ ఆపరేషన్..ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని.. ఇంట్లోనే పెట్టాలని.. బయట ఎవరికి చెప్పొద్దని అతని భార్యకు హుకుం…చివరికి ఆ అమాయకుని ప్రాణమే పోయింది. ఇది ఖాకీల కర్కశత్వానికి నిలువెత్తు నిదర్శనం.
మెదక్ కు చెందిన ఖదీర్ ఖాన్ అనే ఓ సామాన్యుడి విషాందాంత కథ ఇది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి భార్యా,ముగ్గురు పిల్లలున్నారు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో విధి వెక్కిరిస్తే.. ఖాకీలు యమదూతలయ్యారు. అతను గత నెల 27న అరబ్ గల్లీలో రోడ్డు పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ మహిళా పుస్తెల తాడు కొట్టేశారంటూ మెదక్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. అనుమానం కింద విచారించడానికి ఖదీర్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు.
అతని చేత నిజం కక్కించడానికి స్టేషన్ లోనే నాలుగు రోజుల పాటు ఉంచి థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. ఎలాంటి కేసు నమోదు చేయకుండానే అతన్ని కుళ్లపొడిచారు. చివరికి అతను కాదని తేలిన తరువాత అతడి భార్యను స్టేషన్ కు పిలిచి.. ఖదీర్ ను ఇంటికి తీసుకొని వెళ్లాలని.. కాని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని.. బలానికి గోలీలు కూడా తామే తెచ్చిఇస్తామని.. అవి వేసుకుంటే అంతా సర్దుకుంటుందని.. హుకుం జారీ చేశారు.
అయితే ఖాకీల కర్కశత్వానికి తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఖదీర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిస్తూ పోయింది. దీంతో ఈనెల 8న అతడ్ని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికెళ్ళారు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారుతుండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖదీర్ గురువారం అర్థరాత్రి ప్రాణాలు వదిలాడు.
అయితే మెదక్ డీఎస్పీ మాత్రం.. తాము విచారించి వదిలిపెట్టినప్పుడు ఖదీర్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. తరువాత అస్వస్థతకు గురయ్యాడని చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఖదీర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన పలువురు నేతలకు.. పోలీసులు ఎలా కొట్టారో వివరిస్తూ ఆయన మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.