బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కవిత పేరు రిమాండ్ రిపోర్ట్ లో ఉండగా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు శశికళ కు ఒక న్యాయం.. తెలంగాణ శశికళకు మరో న్యాయమా? అంటూ ఆయన ప్రశ్నించారు.
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఒక నిర్ధారిత ప్రదేశంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే తాను హైదరాబాద్ లోని తన ఇంట్లోనే విచారణకు హాజరవుతానని కవిత అప్పటికప్పుడు సీబీఐకు సమాధానం ఇచ్చారు. అయితే కవిత అనూహ్యంగా సీబీఐకి లేఖ రాసినట్లు రాశారు. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం నా వద్దకు రావాలనుకుంటున్నారు సరే.. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదుతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు అందించాలని కవిత కోరారు.
సాధ్యమైనంత త్వరగా ఈ కాపీలను అందించాలని ఆమె సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహీకి లేఖ రాశారు. అంతేకాక మీరు అడిగినట్లు డిసెంబర్ 6వ తేదీ కాకుండా ఈ డాక్యుమెంట్లు నాకు అందిన తర్వాతే విచారణ డేట్ ఫిక్స్ చేద్దామని కవిత పేర్కొన్నారు. అయితే కవిత రాసిన లేఖ మీద సీబీఐ ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదు.
ఈ విషయంపై బక్క జడ్సన్ సీబీఐ మీద మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమంటూ ఆయన ఆరోపిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఉండగా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు బక్క జడ్సన్.