అసమ్మతి నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. ఈ మేరకు విషయాన్ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రేపు బోయిన్పల్లిలో జరిగే శిక్షణా తరగతులకు హాజరుకావాలని వారిని కోరినట్టు తెలుస్తోంది.
మాజీ పీసీసీ ఛీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డికి ఖర్గే ఫోన్ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. రాష్ట్రంలో నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరినట్టు చెప్పారు.
ఇక పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో సీనియర్లు ఆలోచనలో పడ్డారు. రేపు బోయిన్ పల్లిలో జరిగబోయే శిక్షణా తరగతులకు హాజరు కావాల? వద్దా? అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా వుంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు పీసీసీ చీఫ్ కు ఏఐసీసీ నుంచి అనుమతి లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ సర్క్యులర్ ప్రకారం ఈ నెల 26 నుంచి రెండు నెలలపాటు బ్లాక్ స్థాయిలో పాదయాత్ర నిర్వహించాలని సూచించినట్టు చెప్పారు. చివరగా హైదరాబాద్లో నిర్వహించబోయే పాదయాత్రలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని వెల్లడించారు. అదే విధంగా మహిళా కాంగ్రెస్ నిర్వహించబోయే పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు.