ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై ఆ సంస్థ సీఈవో స్పందించారు. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని సీఈవో విల్సన్ అన్నారు. ఈ ఘటనపై సంస్థ తరఫున క్షమాపణలు కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ విమానాల్లో అనుసరిస్తున్న ఆల్కహాల్ సర్వీస్ విధానంపై సమీక్ష జరపనున్నట్టు ఆయన వెల్లడించారు. విమానంలో ఆల్కహాల్ సర్వీస్, సంఘటనల మేనేజ్మెంట్, బోర్డులో ఫిర్యాదుల నిర్వాహణ, నమోదులపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు.
దీంతోపాటు సిబ్బంది వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, అంతర్గత దర్యాప్తులు వంటి అంశాలపై ఎయిర్లైన్ సమీక్ష చేపట్టినట్లు ఆయన వివరించారు. గతేడాది నవంబర్ 26న ముంబైకి చెందిన శంకర్ మిశ్రా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు.
బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న అతను మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు ఈ ఘటనలో ఒక పైలట్, నలుగురు సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. వారికి షోకాజ్ నోటీస్ లు కూడా జారీ చేసింది. వారిని విధులకు దూరంగా ఉంచి గ్రౌండ్ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిపై కూడా అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.