ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. దానికి గతేడాది అక్టోబరు 8న కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే నెలలో ఈ బిడ్డింగ్ ను ధ్రువీకరిస్తూ. కేంద్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను జారీ చేసింది. అక్టోబరు 25న, ఈ ఒప్పందానికి సంబంధించిన షేర్ పర్చేస్ అగ్రిమెంట్ పై ప్రభుత్వం సంతకం చేసింది. ఇక మిగతా ప్రక్రియ కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అవి పూర్తయిన వెంటనే ఈ వారాంతం నాటికి ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాల చేతుల్లో పెట్టనున్నట్లు తెలిపాయి.
ఎయిర్ ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్ వినోద్ హెజ్మాది కూడా ఇదే విషయాన్ని సంస్థ సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. జనవరి 27 నుంచి ఎయిర్ ఇండియా నిర్వహణ టాటాలు అందుకోనున్నట్లు ఆయన తన మెయిల్ లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించే ఎయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ లో 100 శాతం.. ఐఏఎస్ఏటీఎస్లో 50 శాతం టాటా గ్రూప్ నకు దక్కనుందని తెలిపారు.
ఎయిర్ ఇండియా రాకతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి మూడో విమానయాన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిర్ ఇండియా నిర్వహణ బాధ్యతలు వచ్చిన తర్వాత ఎయిరేషియా ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ ను విలీనం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.
ఈ ఒప్పందంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ పూర్తిగా టాటా గ్రూప్ అధీనంలోకి ఎయిర్ ఇండియా వెళ్లనుంది. 89ఏళ్ల కిందట 1932లో జేఆర్డీ టాటా.. టాటా ఎయిర్ సర్వీసెస్ స్థాపించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా మారింది. 1953లో దీన్ని జాతీయకరణ చేయడంతో ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ప్రైవేటు సంస్థలను విమానయాన రంగంలోకి అనుమతించాక ఎయిర్ ఇండియా క్రమంగా తన ప్రభ కోల్పోసాగింది. 2007-08లో ఇండియన్ ఎయిర్ లైన్స్ తో విలీనం అనంతరం సంస్థకు నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ బాటపట్టింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తిరిగి టాటాలు దక్కించుకున్నారు.