అఖిల్ కంటే ఎక్కువగా అక్కినేని నాగార్జునకే నిరుత్సాహం కలిగింది తన ఫిల్మీ కెరియర్ చూసి. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నాడు అఖిల్. తను తదుపరి ప్రాజెక్ట్ విషయంలో మునుపటిలా తొందరపడి డెసిషన్ తీసుకోవడం లేదు. మొత్తం రెండు ప్రాజెక్టులు ఇప్పుడు తనకు లైన్లో ఉన్నాయి.
ఏయన్నార్ నట వారసుడిగా అక్కినేని నాగార్జున నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలనే చూస్తున్నాడు కింగ్ నాగార్జున-అమల దంపతుల ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని. మాస్ ఎంటర్టైనర్ అంటూ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో డెబ్యూ చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర ఘోరపరాభవాన్ని అందించింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి మరచిపోలేని ‘మనం’ సినిమా అందించిన విక్రం దర్శకత్వంలో హలో చేసినా అదీ విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. ముచ్చటగా మూడవసారి మిస్టర్ మజ్ఞూ అంటూ ఒక లవ్ స్టోరీ చేసినా మళ్ళీ అదే ఫలితం.
బొమ్మరిల్లు వంటి విజయవంతమైన సినిమా అందించిన భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సినిమా ఆల్రెడీ పట్టాలెక్కేసింది. ఆ సినిమా సెట్స్పై ఉండగానే మరోవైపు ‘అ’, ‘కల్కి’ వంటి చిత్రాల్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రశంత్వర్మ దర్శకత్వంలో ఓ క్రైం థ్రిల్లర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్.
తాజాగా అందిన సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో ‘గీత గోవిందం’ వంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు పరశురాం చెప్పిన ఒక కథ విని నాగార్జున అండ్ అఖిల్ వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. నిజానికి గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పరశురాం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్స్టార్ మహేశ్బాబుతో చెయ్యాలని తెగ ప్రయత్నించాడు. ఓ దశలో ఆ సినిమా ఫైనలైజ్ అయింది. దర్శకుడు కొరటాల శివ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా చెప్పారు. ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఓకే అనిపించుకున్న ప్రాజెక్టు తొందరగా పట్టాలెక్కి పరశురాంతో పాటూ విజయం కోసం తపిస్తున్న అఖిల్కీ మంచి సక్సెస్ ఇవ్వాలని అందరూ ఆశిస్తున్నారు.