కేంద్రం తీసుకొచ్చిన కొత్త కరెంట్ పాలసీపై తెలంగాణ మండిపడుతోంది. ఈ పాలసీకి మేం పూర్తి వ్యతిరేకమని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. కొత్త పాలసీల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణం చేయడానికి కేంద్రం ఎత్తులు వేస్తోందని ఆయన ఆరోపించారు.
విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందుగానే చెల్లించాలన్న కేంద్రం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కోసమే ఈ ఎత్తులన్నీ కేంద్రం వేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయడం చూసి కేంద్రం ఓర్వ లేకపోతుందని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ను ఆపే ప్రసక్తే లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతుల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేందుకు సబ్సిడీలు ఇస్తున్నామన్న జగదీశ్ రెడ్డి కేంద్రం ఫ్యూడల్ ఆలోచనలతో పేదలకు నష్టం కలుగుతోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.