తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసుతో మరో సారి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహరం తెరపైకి వచ్చింది. ఇప్పటికే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మాటల యుద్దం కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలోకి హస్తం ఎంటరవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో.. ఇందులో ఇంప్లీడ్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ మేరకు న్యాయసలహాతో ముందుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. 2018 లో కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని సీబీఐని కోరేందుకు సిద్ధమైంది. దీని కోసం రాష్ట్రపతిని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు పీసీసీ ఇప్పటికే అపాయింట్మెంట్ కోరింది. ఇక ఎమ్మెల్యేల ఎర కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ రెండు కోణాల్లో చూడాలని పీసీసీ కోరుతోంది.
రెండు పార్టీలను బాధితులుగా చూపుతున్నారని.. ఇందులో దోషి ఎవరు.. నిర్దోషి ఎవరో సీబీఐ తేల్చాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. నేరం జరిగిందంటూనే.. విచారణ తామే చేస్తామనడంతో బీఆర్ఎస్ లోపం బయటపడుతుందన్న కాంగ్రెస్..నేరమే జరగలేదంటూ సీబీఐ విచారణ కోరటంతో బీజేపీ లోపం బయటపడుతుందని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కేసు విచారణను హైకోర్టు.. సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది.
అయితే ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వారే ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 లో అధికార పార్టీలోకి వెళ్లిన 12 మందిలో కొందరికి ప్రభుత్వంలో పదవులు దక్కాయి. అది కూడా లంచం కిందకే వస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు నలుగురికే పరిమితం చేయకుండా.. 2018 నుంచి జరిగిన పరిణామాలపై విచారణ జరపాలని సీబీఐని కోరనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సీబీఐ తన వినతిని స్వీకరించకపోతే న్యాయపరంగా ముందుకెళ్లి.. అందులో ఇంప్లీడ్ కావాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇస్తాయని ఆ పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు.