వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం రేగుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు బాపట్ల జిల్లాల్లో జరిగిన ఓ ఘటన చర్చగా మారింది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజా కలకలానికి కారణమయ్యాయి.
పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురష్కరించుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలు ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ ఫ్లెక్సీల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఫోటోను ముద్రించారు.ఇప్పటి వరకు తన సోదరుడితో పాటు వైసీపీలోనే కొనసాగుతున్నారు ఆమంచి స్వాములు.. కానీ జనసేన ఫ్లెక్సీల్లో స్వాములు ఫోటోతో కొత్త చర్చ మొదలైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ , ఆ వెనుకే ఆమంచి స్వాములు ఫోటోలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక నాదెండ్ల మనోహార్, నాగబాబు ఫోటోలను కూడా ఆ ఫ్లెక్సీల్లో పొందుపర్చారు. అయితే ఆ ఫ్లెక్సీలతో తమకు సంబంధం లేదంటున్నారు ఆమంచి స్వాములు వర్గీయులు. ఇదే సమయంలో ఫ్లెక్సీల తొలగింపుపై మాత్రం వారు మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమంచి స్వాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారా.. పార్టీ మారుతున్నారా.. జనసేన పార్టీలో చేరనున్నారా.. అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
ఒక వేళ ఆమంచి స్వాములు వైసీపీకి గుడ్ బై చెబితే..మాజీ ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ఱమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా.. అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా ఓ వైపు నెల్లూరు రాజకీయం హీట్ తగ్గక ముందే మరో ఘటన ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు తెరలేపింది.