తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు అమరావతి ప్రాంత రైతు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన పులి మరియదాసు అలియాస్ చిన్నా.. రాజధాని ఉద్యమంలో క్రీయాశీలకంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఏపీలోని బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామ పరిధిలో ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. అందులో 70 సెంట్లలో లోకేష్ ముఖాకృతిలో వరి పండించాడు.
ఈ నెల 23వ తేదీన లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన ముఖ చిత్రంతో వరి పంట వేశారు. ఆదివారం పంట కోసి ధాన్యాన్ని లోకేష్ కు పుట్టిన రోజు కానుకగా ఇవ్వనున్నాడు.
లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని తన పచ్చని పంట ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చాడు రైతు పులి చిన్నా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.