మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోననని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన అనంతరం రాజధాని రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని ఆయన్ను వెతికిపెట్టాలని పోలీసులకు రైతులు, కూలీలు ఫిర్యాదు చేశారు.
రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసభన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ ఆయన కార్యాలయంలోగానీ నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు.
Advertisements