అమరావతిలో ఆర్-5 జోన్ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. భూముల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి సీఎం జగన్ శుక్రవారం రానున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన తెలిపారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
దీక్షా శిబిరం వద్ద ఉరితాళ్లతో నల్ల రిబ్బన్లను కట్టుకుని నిరసన తెలిపారు. పేదలారా.. మరోసారి మోసపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే ముఖ్యమంత్రి గో బ్యాక్, రాజధాని ద్రోహులు గో బ్యాక్, అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్ కాపాడండి.. అంటూ నినాదాలు చేశారు.
తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. తమను మోసం చేయొద్దని.. సీఎం జగన్ మొండి వైఖరిని నశించాలన్నారు. మరోవైపు మందడంలోని దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.