సంకల్పం ధృఢంగా ఉంటే చాలు.. ప్రభుత్వాన్ని కూడా ఎదురించి తగినంత బుద్ధి చెప్పొచ్చని బీహార్ లోని ఓ గ్రామస్థులు నిరూపించారు. అంతే కాదు తాము చందాలు వేసుకొని కట్టుకున్న వంతెనకు ఏకంగా ప్రపంచ కుబేరుడు అంబానీ పేరు పెట్టి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. దేశ ప్రధాని దృష్టిని ఆకర్షించాలన్న వాళ్ళ తపన కూడా దీంతో ఫలించింది.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. రామ సేతు పేరు అందరూ వినే ఉంటారు.. కానీ ఇప్పుడు అంబానీ సేతు ను నిర్మించారు బీహార్ లోని కిరాత్ పుర్ గ్రామస్థులు. ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మించండంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. చివరకు విసిగిపోయిన గ్రామస్థులు తామే సొంతంగా ఓ వంతెన నిర్మించుకున్నారు. ప్రభుత్వ సాయం అడగకుండా తమ సొంత డబ్బులతో చందాలు వేసుకొని మరీ ఈ బ్రిడ్జిని నిర్మించుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కాని ప్రభుత్వ పని తీరును ప్రపంచానికి తెలిసేలా ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే వింతగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ పేరును ఈ వంతెనకు పెట్టారు ఆ గ్రామస్థులు. అయితే కోసీ నది పై వంతెన లేకపోవడం వల్ల కిరాత్ పుర్ గ్రామస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం తమ గోడును వినడం లేదని ఆవేదన చెందారు. చివరికి గ్రామస్థులందరూ కలిసి తమ సొంత డబ్బులతో 6 లక్షల విరాళాలు వేసుకున్నారు. 2000 వెదురు కర్రలతో 250 అడుగుల పొడవైన వంతెనను నిర్మించారు.ఈ వంతెనకు ముకేశ్ అంబానీ పేరు మీద అంబానీ సేతు అని పేరు పెట్టారు.
అంతకు ముందు చచెరీ వంతెనగా పిలుస్తుండగా..ఇలా అంబానీ పేరు పెట్టడం వల్లైనా.. ప్రభుత్వం దృష్టి తమ గ్రామంపై పడుతుందనే ఇలా చేశామని గ్రామస్థులు వాపోయారు. ఈ వంతెన కేవలం నడకకు మాత్రమే పని చేస్తుందని చెప్పారు. ఏదైనా వాహనాన్ని వంతెనపై నడిపితే 500 జరిమానా విధిస్తామని తెలిపారు.