– ముస్తాబైన 6వ అంతస్తు
– అంబేద్కర్ జయంతి నాడే వేడుక?
– అంతకంటే ముందే సీఎం పూజలు
– ప్రారంభోత్సవానికి 3 రాష్ట్రాల ముఖ్యనేతలు
– సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి మళ్లీ కసరత్తు మొదలైంది. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజునే నూతన సెక్రెటేరియట్ ను ప్రారంభించడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు.
అయితే అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా పూజలు నిర్వహించే అవకాశం ఉంది. దీని కోసం కూడా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు సమాచారం. 6 వ అంతస్తును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17 వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా అనుకుంది.
కానీ, శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అది కాస్త వాయిదా పడింది. దీంతో మరో ముహూర్తం కోసం సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇక సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ఈ భవనానికి ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జయంతి రోజే ప్రారంభించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భవన నిర్మాణాన్ని తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రారంభం కూడా అంతే వైభవంగా చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ఏర్పాట్లను ఆర్ అండ్ బీ భారీ స్థాయిలో చేస్తోంది. 3 రాష్ట్రాల ముఖ్య నేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. మరో వైపు కేసీఆర్ జన్మదినాన నూతన సచివాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రతిపక్షాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే.