ఉక్రెయిన్ లోని తమ ప్రజలంతా వెంటనే స్వదేశం తిరిగి రావాలని అమెరికా సూచించింది. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో యుద్ధం జరిగే ముప్పు పొంచి ఇన్నట్టు తెలిపింది. సొంత దేశానికి రావడానికి ఎక్కువ సమయం లేదని పేర్కొంది. వీలైనంత త్వరగా బయల్దేరాల్సిందేనని తమ దేశ పౌరులకు పిలుపినిచ్చింది.
ఉక్రెయిన్ పై రష్యా ఈ వారంలోనే దండయాత్ర చేయడానికి సిద్దం అయిందిని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా.. 48 గంటల్లో రష్యా సైన్యం ఉక్రెయిన్ పై ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ తెలిపారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసేలోపు దాడి జరిగే ముప్పు ఉందని ఆయన విల్లడించారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన తర్వాతనే ఈ సూచనలు చేస్తున్నామని.. కానీ తమ సైన్యానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారా లేదా అనేది తాము చెప్పడం లేదన్నారు. ఒకవేళ వైమానిక దాడులు మొదలైతే ఆ సమయంలో ఉక్రెయిన్ నుంచి వెళ్లడం కష్టంగా మారుతోందని హెచ్చరించారు. అక్కడి ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతాయని చెప్పారు. కాగా.. అమెరికా చేస్తోన్న ఆరోపణలను రష్యా మాత్రం కొట్టిపారేస్తోంది.
ఉక్రెయిన్ సరిహద్దు వద్ద రష్యా ఇప్పటికే సుమారు లక్ష మంది దళాలను మోహరించింది. ఉక్రెయిన్ వదిలి వచ్చేయాలని ఇప్పటికే బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్, లత్వియా, జపాన్, దక్షిణ కొరియాలు కూడా తమ పౌరులకు సూచించాయి. ఉక్రెయిన్ రాజధాని కియివ్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. అలాగే.. తూర్పు ఐరోపాలో అమెరికా బలగాల సంఖ్య 6,000కు చేరనుంది.