మనకీ ఒకరోజొస్తుందనే ఆశాభావం. అసంభవమే అయినా మనకి సంభవమంటూ కేశాన్ని కొండకేసి లాగే సంకల్పం. వేలమందిలో ఒకర్ని మాత్రమే వరించే అదృష్టం. దాని పేరే లాటరీ. లక్కు చిక్కితే అప్పటి వరకు నిట్టూర్చిన జీవితం.జూలు విదిలిస్తుంది.విజిలేస్తుంది.విజృంభిస్తుంది. కలలన్నీ నిజం చేసుకునే అవకాశం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అచ్చం ఇలాంటి అదృష్టమే అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఓ వ్యక్తిని వరించింది.
ఓ వ్యక్తి ఏకంగా రూ.6,536 కోట్లకు పైగా సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు. అమెరికా డాలర్లలో దీని విలువ 754.6 మిలియన్ల డాలర్లు. పవర్బాల్ లాటరీ గేమ్లో ఈ భారీ జాక్పాట్ను సొంతం చేసుకున్నారు ఆ వ్యక్తి.
ఒక టికెట్ మొత్తం ఆరు నంబర్లు(05, 11, 22, 23, 69, 07)తో సరిపోలిందని.. దీని మొత్తం విలువ రూ.6,536.46 కోట్లకు పైనే అని లాటరీ నిర్వాహకులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు.
అయితే జాక్పాట్ నగదు మొత్తాన్ని విజేతకు విడతలవారీగా చెల్లిస్తారు. తొలుత కొంతభాగం ఇచ్చేస్తారు. మిగిలిన మొత్తాన్ని గెలిచిన సమయం నుంచి 29 సంవత్సరాల వరకు దశలవారీగా చెల్లిస్తారు.
గెలుచుకున్న మొత్తానికి సంవత్సరానికి 5 శాతం చొప్పున వడ్డీని కలుపుతారు. అయితే విజేత ఇందుకు అంగీకరించని పక్షంలో 754.6 మిలియన్ డాలర్లు జాక్పాట్ మొత్తం కాస్తా 407.2 మిలియన్ల డాలర్లకు తగ్గుతుంది. ఆ సొమ్ము అంతటినీ విజేత చేతికి ఒకేసారి అందజేస్తారు. గెలుచుకున్న ప్రైజ్మనీకి పన్నుల కోతలు విధించిన తర్వాతే విజేతకు ఇస్తారు లాటరీ నిర్వాహకులు.
కాగా, సోమవారం గెలిచిన ప్రైజ్మనీ 2022 నవంబర్ 19 తర్వాత ఇదే అతిపెద్ద జాక్పాట్ అని.. అమెరకా లాటరీ చరిత్రలో ఇది తొమ్మిదవ అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు చెబుతున్నారు.పవర్బాల్ గేమ్ లాటరీని అమెరకాలోని 45 రాష్ట్రాలతో పాటు వాషింగ్టన్, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్లో నిర్వహిస్తున్నారు.