రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపబోయారు దుండగులు. యువతిని ఢీ కొట్టిన వెంటనే అదే కారుతో పారిపోయారు. ఈ వ్యవహారం అంతా సీసీ టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది.
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న సుమియా బేగం అనే యువతిని దుండగులు కారుతో ఢీకొట్టారు. కారు రివర్స్ తీసుకొని, అనంతరం వేగంగా ముందుకు వచ్చి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు. ఈ వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయమైందని వెల్లడించారు.
రోడ్డుప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలు సుమియా బేగం(19) టైలరింగ్ శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఇది రోడ్డు ప్రమాదమా? హత్యాయత్నమా? అనే కోణంలో ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారులో ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.