రైతులతో పాటు స్థానిక ప్రజల నుంచి మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు రావడంతోనే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ఏర్పాటు చేయనున్నారు.గత కొద్ది రోజులుగా కామారెడ్డి మున్సిపల్ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.ఈ సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై చర్చించి.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.
ఈ ఉద్యమాల్లో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని రైతులు, స్థానిక ప్రజలు గట్టిగానే పట్టుబట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు కౌన్సిలర్లు రాజీనామాలు చేసి రైతులకు తమ మద్దతు ప్రకటించారు. వారు కూడా రైతులతో గొంతు కలిపి అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరో పక్క కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇల్లు ముట్టడికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కామారెడ్డి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ లో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.